సత్తుపల్లి డిస్పెన్సరీలో గైనకాలజిస్ట్ను నియమించాలి.
- ఉద్యోగుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.
- ఐఎన్టియుసీ బ్రాంచ్ కార్యదర్శి తీగల క్రాంతికుమార్.
సత్తుపల్లి, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి సింగరేణి డిస్పెన్సరీని అన్ని వసతులతో ఆధునికరించి, గైనకాలజిస్ట్ (ప్రసూతి నిపుణురాలు) డాక్టర్ను తక్షణమే నియమించాలని ఐఎన్టియుసీ బ్రాంచ్ కార్యదర్శి తీగల క్రాంతికుమార్ విజ్ఞప్తి చేశారు.
అయన మాట్లాడుతూ, సత్తుపల్లిలో సింగరేణి సంస్థతో పాటు అనుబంధ ప్రైవేట్ ఓబీ కంపెనీలలో పనిచేస్తున్న సుమారు 3,500 మంది కార్మికులు మరియు వారి కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. డిస్పెన్సరీలో గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు ప్రసూతి సంబంధిత వైద్య సలహాల కోసం కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రికి (సుమారు 90 కి.మీ దూరం) తరచుగా వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల ఆర్థికంగా మరియు శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అలాగే, డిస్పెన్సరీలో పిల్లల వైద్యులు (చిల్డ్రెన్ స్పెషలిస్ట్) మరియు ఐసీయూ సదుపాయం లేకపోవడం వల్ల పదేళ్ల లోపు పిల్లలకు అత్యవసర వైద్యం అందించడం కష్టమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సత్తుపల్లి ప్రాంతం సింగరేణికి సుమారు 16 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణాలో కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేస్తూ, ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం మరింత కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి దేవదాస్, ఐఎన్టియుసీ బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ నాగప్రకాశ్, రామారావు (ఫిట్ సెక్రటరీ, జె.వి.ఆర్ ఓసీ), బాలాజీ (ఫిట్ సెక్రటరీ, కిష్టారం ఓసీ), నాగేశ్వరరావు (ఫిట్ సెక్రటరీ, జె.వి.ఆర్ సిఎచ్పి), అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు కోటి, సురేష్తో పాటు నాయకులు రషీద్, రఫీ, దావుద్, సదానందం, పొట్టి కిరణ్, శ్రీధర్, వెంకటేశ్వర్లు, ఉప్పలయ్య, రాజేందర్, మురళి, హఫీజ్, కట్ట కృష్ణ, రవికాంత్, రామంచి రాజయ్య, కే.రవి తదితరులు పాల్గొన్నారు.


Comments