హైడ్రా పనితీరును అభినందించిన హైకోర్టు
చెరువుల పునరుద్ధరణను యజ్ఞంలా చేస్తోందని వ్యాఖ్య
-బతుకమ్మకుంట అభివృద్ధి చూసి ముచ్చటపడ్డ న్యాయమూర్తి
-టీడీఆర్పై సరైన విధానాన్ని తీసుకురావాలని సూచన
హైదరాబాద్,అక్టోబర్6(తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (హైడ్రా) చెరువుల అభివృద్ధి పనితీరును హైకోర్టు ప్రశంసించింది. నగరంలోని చెరువుల పునరుద్ధరణను యజ్ఞంలా చేస్తోందని పేర్కొంది. ముఖ్యంగా బతుకమ్మకుంట అభివృద్ధి హర్షణీయమని న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.హైకోర్టులో మాధాపూర్ తమ్మిడికుంట చెరువు పరిధిలోని రెండు ఎకరాల భూములకు సంబంధించిన టీడీఆర్ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణలతో చెత్తకుప్పలా, పిచ్చిమొక్కలతో నిండిపోయిన ప్రాంతాన్ని హైడ్రా ఆకర్షణీయమైన చెరువుగా అభివృద్ధి చేసిందని, ఇప్పుడు ఆ ప్రాంతం సర్వాంగ సుందరంగా మారి స్థానికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తోందని ప్రశంసించారు.
బతుకమ్మకుంట పునరుద్ధరణ వలన పరిసర ప్రాంతాలకు వరద ముప్పు తగ్గడమే కాకుండా, భూగర్భ జలాల మట్టాలు పెరిగాయని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని మల్కం చెరువు కూడా ఆహ్లాదకరంగా మారిందని, ఇలాగే నగరంలో మరో ఐదు చెరువుల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో భూములు లేదా గృహాలు ఉన్నవారికి టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) కింద తగిన నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానం రూపొందించాలని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం సక్రమంగా వ్యవహరిస్తే చెరువుల అభివృద్ధికి ఎటువంటి ఆటంకం ఉండదని అన్నారు.టీడీఆర్ కేసులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీధర్ కూడా హైడ్రా పనితీరుపై న్యాయమూర్తి అభిప్రాయాలకు ఏకీభావం తెలిపారు. బతుకమ్మకుంట అభివృద్ధి హైడ్రా కృషికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తమ్మిడికుంట చెరువు పరిధిలో భూములు కోల్పోయిన వారికి సరైన టీడీఆర్ హక్కులు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Comments