పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కడియం

జఫర్ ఘడ్,తెలంగాణ ముచ్చట్లు:జఫర్గడ్ మండలం ఉప్పుగల్ గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు, మాచిరెడ్డిగూడెంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి, తీగారం గ్రామంలో రూ. 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి, రూ. 18 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి రహదారుల నిర్మాణం కీలకమని, అన్ని గ్రామాలకు సరైన రహదారులు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని కేవలం శంకుస్థాపనలకే పరిమితం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని రహదారి సమస్యల నుంచి విముక్తి చేయనున్నట్లు తెలిపారు.
పేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని, గత ప్రభుత్వ అప్పుల భారం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ రైతులకు పంట రుణమాఫీ, రోడ్ల అభివృద్ధి, మరియు పేదల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు.
వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం
66 లక్షల ఎకరాల వరి సాగు, కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. క్వింటాకు రూ. 500 బోనస్ అందించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిబద్ధతకు నిదర్శనమన్నారు.
పరిపూర్ణ అభివృద్ధి హామీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందని, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


Comments