ఆదివాసి విద్యార్థి పాపారావుకు ఓయూ డాక్టరేట్ అవార్డు
నాచారం, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
ఆదివాసి సమాజానికి గర్వకారణంగా, గిరిజన విద్యార్థి ఉద్యమ నాయకుడు సాగబోయిన పాపారావుకు ఉస్మానియా యూనివర్శిటీ డాక్టరేట్ అవార్డు లభించింది. సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ పి. విష్ణుదేవ్ పర్యవేక్షణలో పాపారావు “ఉప ప్రణాళిక మరియు గిరిజన అభివృద్ధి – తెలంగాణ రాష్ట్రంలోని ఐటీడీఏ భద్రాచలం యొక్క సామాజిక శాస్త్ర అధ్యయనం” అంశంపై పరిశోధన పూర్తి చేసి యూనివర్సిటీలో సమర్పించారు.శతాబ్దం పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీలోని సోషియాలజీ విభాగంలో మొట్టమొదటి ఆదివాసి పీహెచ్డీ అవ్వడం పట్ల విభాగంలోని ఆచార్యులు ప్రొఫెసర్ రామ్ షెఫర్డ్ భీనవేని, డాక్టర్ పరంధాములు, డాక్టర్ సోమేశ్వర్ పాపారావును అభినందించారు.మారుమూల ఆదివాసి గూడెంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన పాపారావు, చిన్ననాటి నుంచే అడవిలో ఆకులపై అక్షరాలు నేర్చుకున్నాడు. ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలలో, హైస్కూలు ఆశ్రమ పాఠశాలలో పూర్తి చేశాడు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ చేరిన ఆయన పాలు పంపే డెలివరీ బాయ్, టెలిఫోన్ బూత్ ఉద్యోగిగా పనిచేసి వచ్చిన పాకెట్ మనీతో చదువును కొనసాగించాడు.ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమంలో చేరి "అధ్యయనం–పోరాటం" నినాదంతో ముందుకు సాగిన పాపారావు, జర్నలిజంలో ప్రయాణం కొనసాగిస్తూ గిరిజనుల అభివృద్ధిపై లోతైన అధ్యయనం చేశాడు. తొలి ఆదివాసి డాక్టరేట్ అందుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు."నాకు అక్షరాల జ్యోతి చూపించిన గురువులకు, జీవితం ఇచ్చిన తల్లిదండ్రులకు, దారి చూపించిన స్నేహితులకు జీవితాంతం రుణపడి ఉంటాను" అని పాపారావు పేర్కొన్నారు.


Comments