ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ...
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ -10, తెలంగాణ ముచ్చట్లు;
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ ను జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ పి.హెచ్.సి. లలో పని చేసే ప్రతి సిబ్బంది అటెండెన్స్ ఆన్ లైన్ చేసి 100 శాతం మానిటరింగ్ చేయాలని అన్నారు.
ప్రసవ సమయంలో తల్లి మరణాలకు సంబంధించి కేసులు పరిశీలిస్తే రెండవ ఏ.ఎన్.సి. చెక్ అప్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేసుకున్నట్లు తేలిందని, దీనికి గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు. గత సంవత్సర కాలంగా ప్రతి ఆశా కార్యకర్త పరిధిలో మొదటి, రెండు ఏ.ఎన్.సి. చెక్ అప్ ప్రైవేట్ ఆసుపత్రులలో జరిగిన కేసులు పరిశీలించి రిపోర్టు అందించాలని, దీనికి గల బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ప్రతి వైద్యాధికారి తన పరిధిలోని ఆశా కార్యకర్తలతో రెగ్యులర్ గా సమావేశాలు పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. గర్భిణీ లకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించిన ప్రైవేట్ ఆసుపత్రులపై కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆశా కార్యకర్తలు రెగ్యులర్ గా తమ పరిధిలో ఇంటింటి సర్వే చేస్తూ గర్బీణి మహిళల వంద శాతం ఏ.ఎన్.సి. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఉన్న వసతులు ప్రైవేటు ఆసుపత్రులలో లేవని, ప్రభుత్వ ఆసుపత్రులలో అధికంగా ప్రసవాలు జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, సి సెక్షన్ డెలివరీలను నివారించాలని అన్నారు. అధికంగా సి సెక్షన్ జరుగుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల పై నిఘా పెట్టాలని, ప్రతి సెక్షన్ ఆపరేషన్ పై ఆడిట్ రిపోర్ట్ ఉండాలని అన్నారు.
జిల్లాలో అనవసరంగా సి సెక్షన్ డెలివరీలను చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆశా కార్యకర్తలు ప్రతి గర్భిణీ స్త్రీ ను ఫాలో అప్ చేస్తూ ఉచితంగా మన ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాలు జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి పి.హెచ్.సి. పరిధిలో వంద శాతం పిల్లలకు టీకాలు వేయించాలని, వైద్య అధికారులు టీకాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి ఆశా కార్యకర్త ఫాలో అప్ చేయాలని అన్నారు.
ప్రతి పి.హెచ్.సి. పరిధిలో ఎన్.సి.డి. సర్వే పూర్తి చేసి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, వైద్య అధికారులు తమ పరిధిలో ఆశా కార్యకర్తలతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు. ఎన్.సి.డి. సర్వె నిర్వహణలో ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎం, ఎం.ఎల్.హెచ్.పి. పాత్ర ఎంత ఉండాలో నిర్దేశించుకోవాలని అన్నారు.
ప్రతి పి.హెచ్.సి. పరిధిలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధి నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. గత సంవత్సరం కంటే 58 శాతం డెంగ్యూ కేసులు నేడు తగ్గాయని, దీనికి కృషి చేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. పారిశుద్ద్య సమస్యల వల్ల కేసులు అధికంగా నమోదవుతున్న గ్రామాల జాబితా అందించాలని అన్నారు.
టీబీ నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, నిర్దేశించిన లక్ష్యం మేరకు అనుమానితులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా వైద్య పరీక్షల ఫలితాలు త్వరగా అందించేలా చూడాలని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో పరీక్షలు జరిగినప్పుడు ప్రజలకు మనపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. ప్రతి పి.హెచ్.సి.కి లక్ష్యాలు కేటాయించి వైద్య పరీక్షల శాంపిల్స్ సేకరించాలని అన్నారు. డయాగ్నోస్టిక్ హబ్ నిర్వహణకు అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని, ప్రతి రోజూ పూర్తి సామర్థ్యంతో టీ-హబ్ పని చేయాలని అన్నారు.
పి.హెచ్.సి. పరిధిలో సికిల్ సెల్ అనీమియా క్యారియర్స్ కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
అనంతరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి. కళావతి బాయి, వివిధ ప్రోగ్రాం అధికారులు, వైద్య అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments