రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలి...
అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ఖమ్మం బ్యూరో, నవంబర్- 11, తెలంగాణ ముచ్చట్లు;
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పత్తి, ధాన్య కొనుగోళ్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం తల్లాడ, కల్లూరు మండలాల్లో అదనపు కలెక్టర్ పర్యటించి సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు, ధాన్య కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, తల్లాడ మండల కేంద్రంలో సిసిఐ చే ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. పత్తి కొనుగోళ్లను పరిశీలించి, ట్యాబ్ ఎంట్రీ, పంట నమోదులను తనిఖీ చేశారు. కొనుగోలుకు వచ్చిన పత్తిని తేమ యంత్రంతో తేమ శాతం పరిశీలన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు రైతులకు సహకరించి, కొనుగోలు ప్రక్రియ సజావుగా చేపట్టాలన్నారు. తల్లాడ లోని వెంకట పద్మావతి రైస్ మిల్ ను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యం దిగుమతి, ట్రక్ షీట్ల నమోదుకు పరిశీలించారు.
కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్నివెంట వెంటనే అన్లోడ్ చేసుకోవాలని మిల్లర్ కు సూచించారు. అదనపు కలెక్టర్ తన పర్యటనలో తల్లాడ మండలంలోని నూతనకల్, రంగంబంజర, కల్లూరు మండలంలోని లింగాల, పుల్లయ్య బంజర గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్య కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రోజుకు ఎంతమేర ధాన్యం కేంద్రాలకు వస్తున్నది, ఎంతమేర రవాణా చేస్తున్నది, రైతులకు కల్పిస్తున్న వసతుల గురించి ఆరా తీశారు. రైతులతో మాట్లాడి, కొనుగోళ్లలో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం చూసుకొని కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొని రావాలని రైతులను కోరారు. అధికారులు రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ వెంట వెంటనే చేపట్టాలని, రైతులకు వారి ధాన్య మొత్తం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదనపు కలెక్టర్ పర్యటన సందర్భంగా జిల్లా సహకార అధికారి గంగాధర్, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీలత, అధికారులు తదితరులు ఉన్నారు.


Comments