రామప్ప - లక్నవరం క్షేత్ర పర్యటనకు వెళ్లిన ధర్మసాగర్ విద్యార్థులు
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ధర్మసాగర్ యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో 67 మంది విద్యార్థులు, 7 మంది ఉపాధ్యాయులు, 4 మంది సబ్ స్టాఫ్ రామప్ప, లక్నవరం ప్రాంతాల సందర్శనకు వెళ్ళారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మ ప్రకాష్ ఈ క్షేత్ర పర్యటనను ప్రారంభిస్తూ, తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో యువ టూరిజం క్లబ్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులను రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను దర్శించడానికి ప్రోత్సహించుతున్నట్లు తెలిపారు.
ఈ పర్యటన ద్వారా విద్యార్థులు రామప్ప ఆలయ చారిత్రక, శిల్పకళా ప్రాముఖ్యతను తెలుసుకోగా, కాకతీయుల పాలన కాలంలో సంస్కృతిని సవివరంగా అవగాహన చేసుకున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప గుర్తింపు పొందిన విశేషాలను నేరుగా చూసి అభినందించారు. లక్నవరం సరస్సు అందాలు, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణంలోని ఇంజనీరింగ్ నైపుణ్యాలను గమనించి, బోటు షికారులో వినోదాన్ని ఆస్వాదించారు.
ఉపాధ్యాయులు కవిత, కే సురేష్, రాజమ్మ, రామకృష్ణ, సునీత, పిఎస్ సురేష్ వంటి వారంతా తమ సమన్వయంతో పర్యటనను విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ అభివృద్ధి చెందాయని ధర్మ ప్రకాష్ తెలిపారు.


Comments