డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని రిలే నిరాహార దీక్షలు
-అహ్మద్ గూడా 2బిఎచ్కే ప్రాంతంలో అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజలు
-సిఐటియు నేతృత్వంలో ప్రారంభమైన నిరాహార దీక్షలు
-సౌకర్యాలు మెరుగుపరచాలని, అసంపూర్తి పనులు పూర్తి చేయాలని డిమాండ్
-ఈ నెల 25న కలెక్టర్ కార్యాలయ ముట్టడి హెచ్చరిక
కీసర,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ, కీసర మండల పరిధిలోని అహ్మద్ గూడా డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు సిఐటియు కీసర మండల నాయకులు బంగారు నర్సింగరావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఫేస్ వన్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ అహ్మద్ గూడా 2బిఎచ్కే ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జనరేటర్లు ఏర్పాటు చేయడం, లీకేజీలను నివారించే మరమ్మత్తులు చేయడం, అవసరమైన సౌకర్యాలను కల్పించడం కోసం ఎన్నోసార్లు అధికారులను కోరినా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీక్షకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకుడు డీజే నరసింహరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనాల కోసం తొందరపడి ఇళ్ల పంపిణీ చేపట్టిందని, కానీ మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసి తగిన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
అలాగే సిపిఎం జిల్లా కార్యదర్శి పి. సత్యం మాట్లాడుతూ 2బిఎచ్కే పరిసరాల్లో సీసీ కెమెరాలు, రహదారులు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అసంపూర్తిగా వదిలేసిన పనులను సంస్థ ఖర్చుతో పూర్తి చేయాలని అన్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 25న కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, కేవీపీఎస్ నాయకులు, అహ్మద్ గూడా ఫేస్ వన్కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాన్ని న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. 


Comments