సమాచార హక్కు చట్టం కమీషనర్లను నియమించాలని మంత్రి సురేఖ కు వినతి
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
హైదరాబాద్ లో తెలంగాణ అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని, సచివాలయంలోని ఆమె కార్యాలయంలో, సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చంటి ముదిరాజ్,జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. ఇందులో 2005 లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టం కమీషనర్లను వెంటనే నియమించాలని కోరారు.
ఈ సందర్భంగా, కొండా సురేఖ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం సెక్షన్ 3 ప్రకారం, దేశంలోని ప్రతి పౌరునికీ సమాచారం పొందే హక్కు ఉందని తెలిపారు. అటువంటి కమీషనర్ల నియామకానికి తనవంతుగా ప్రయత్నిస్తానని చెప్పారు.
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు చంటి ముదిరాజ్, సెక్షన్ 6(1) ప్రకారం సమాచారానికి దరఖాస్తు చేసినప్పటికీ, 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం కొన్నింటిని కొన్ని నెలలు గడిచినా అందించలేదని పేర్కొన్నారు.
రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి, సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్పీల్ చేసినప్పటికీ, సమాచారాన్ని అందించకపోవడం, అలాగే సెక్షన్ 19(3) ప్రకారం రెండవ అప్పీల్ చేసినా, రాష్ట్ర కమిషన్ ఆఫీస్ లో కమిషనర్లు లేకపోవడం వల్ల దరఖాస్తులు పరిష్కరించలేకపోతున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, ఆర్టీఐ కమిషనర్లను వెంటనే నియమించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తుల మహేష్ గౌడ్, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు జి.ప్రియ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వింజమూరి గణేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments