రుధిర ధార పుస్తక సమీక్ష
అన్యాయాలపై అక్షర సమరం
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
"పీడిత ప్రజల రక్షణ కోసం మీరెందుకు పోరాడరు?" అని ఖుర్ ఆన్ మనల్ని ప్రశ్నిస్తుంది. కానీ కవయిత్రి బతూల్ హుమైర్వీ అందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పేదలు, యుద్ద బాధితులు, మైనారిటీలు, రైతులు, మహిళల కష్టాలకు కారణమైన వారిని తన కవితలతో ధైర్యంగా ప్రశ్నిస్తారు. వివిధ అమానవీయ సందర్భాల్లో తన ఆవేదనకు, ఆలోచలనకు కవితల రూపం ఇచ్చారు. తాను చెప్పాలనుకున్న భావాలను గుండెకు హత్తుకొనేలా పదునైన పదాలతో అక్షీకరించారు. "అన్యాయాలపై ధ్వజమెత్తే ధీర వనితలు లేనంత వరకు" ఆడపిల్లల ఆయువుకు రక్షణ ఉండదని ఓ కవితలో హెచ్చరించారు. స్వేచ్ఛా గీతిక కవితలో "నా పరదా జాత్యాంహకారులపై నిరసన జెండా!" అంటూ కర్ణాటకలో హిజాబ్ నిషేధాజ్ఞలపై తన కోపాన్ని ఎలుగెత్తి చాటారు. అయితే భద్రత పేరిట అభద్రతను నెలకొల్పే కుటిల కుట్రలను ఎదుర్కోవడం ఎలాగో అని ప్రభుత్వ చర్యలపై ఆందోళన చెందారు. పోలీసుల కాల్పుల మోతలు రైతులను బెదిరించ లేవని.. అవి వారిని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తున్నాయని ఇంక్విలాబ్ కవితలో వర్ణించారు. ఉద్యమ స్ఫూర్తిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతులను "పట్టు వీడని విక్రమార్కుల"ని కీర్తించి వారికి సలాం చేశారు. "కుట్ర మీకు మతమైంది.. అవి తెలియక వాటికి బలైంది మేమే!" అని కాషాయ శక్తుల అధికార మతోన్మాదానికి శోకిస్తారు. "దేశమంటే మానవత్వం" అని సరికొత్త అర్థాన్ని ఇచ్చి "మనువాదానికి మానవత్వం నేర్పుదాం రండి!" అని పిలుపునిచ్చారు. దేశ దిమ్మరులకు ఆశ్రయం ఇచ్చిన పాపానికి ప్రాయశ్చిత్తమిది...అని పలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధం పట్ల విచారం వ్యక్తం చేశారు. వాస్తవానికి బతూల్ హుమైర్వీ "రుధిర ధార" కవితా సంకలనం ఇస్లాంవాద కవిత్వమే కాదు... అభ్యదయ ప్రపంచాన్ని కోరే మానవవాద సాహిత్యం. బడుగుల కష్టాలను ఆమె వర్ణించిన తీరు, మతోన్మాద శక్తులను ప్రశ్నించిన పద్ధతి మానవత్వం ఉన్నవారిని కదిలిస్తాయి..కర్తవ్యోన్ముఖుల్ని చేస్తాయి. ముహమ్మద్ ముజాహిద్, 9640622076


Comments