జీతాలు లేక ఇబ్బందులు మిడ్డే మీల్స్ వర్కర్లు.!
ఆరు నెలలుగా వేతనాలు బాకీ.
సత్తుపల్లి, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
మధ్యాహ్నం భోజన పథకంలో పనిచేస్తున్న వర్కర్లు గత ఆరు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు వేయకపోవడం వల్ల తమకు వేతనాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పచారీ సామాన్లు, కూరగాయలు, గుడ్లు షాపుల వారు కూడా ఇకపై అరువు ఇవ్వడం మానేశారని, తాము అప్పు తెచ్చి పిల్లలకు భోజనం పెట్టాల్సి వస్తోందని వాపోయారు. “మేమంతా బీద, మధ్యతరగతి వారమే. కట్టెల పొయ్యిపై వంట చేస్తే పొగ కళ్లల్లోకి పోయి కంటి సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం గ్యాస్ పొయ్యి, సిలిండర్లు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఇవ్వలేదు” అని వర్కర్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం నెలకు మూడు వేలు జీతం ఇస్తామని హామీ ఇచ్చినా కనీసం వెయ్యి రూపాయలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వేతనాలు చెల్లించడంతో పాటు ప్రతి నెలా బిల్లులు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని విన్నవించారు.
ఈ సమస్యపై మండల విద్యా అధికారిని కలిసి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వర్కర్లు కోరుతున్నారు.


Comments