వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయాలి
వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్ష
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని, ఆ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా, బుధవారం సచివాలయంలో జరిగిన సమీక్షాసమావేశంలో, వరంగల్ నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్, భద్రకాళి చెరువు, విమానాశ్రయం వంటి అంశాలపై చర్చించారు.
సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ప్రతీ ప్రాజెక్టు కోసం డీపీఆర్ లను త్వరగా సిద్ధం చేయాలని, అలాగే ప్రభుత్వ నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను సూచించారు.
వరంగల్ నగరంలో నిర్మించే రింగ్ రోడ్డు జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలని, ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. అలాగే, ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణను కూడా త్వరగా చేయాలని, భద్రకాళి చెరువు శుద్ధీకరణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి దాన కిశోర్, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ దేవి, మైనింగ్ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారదా, పి. ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.


Comments