విద్యతో పాటు క్రీడలు అవసరం
జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి
మేడ్చల్ మల్కాజిగిరి, డిసెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, విద్యార్థుల కు కావాల్సిన క్రీడా పరికరాలు, మైదానాలు, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ద్వారా అందిస్తామని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి తెలిపారు.శనివారం శామీర్పేట్ మండలం హకీంపేటలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ క్రీడల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య, నిర్వహిస్తున్న క్రీడలు, కోచ్ల శిక్షణ విధానం తదితర అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన కలెక్టర్, చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడల గురించి అడిగి తెలుసుకున్న ఆయన, ప్రస్తుతం ఉన్న క్రీడలకు తోడు మరే క్రీడలు కావాలని ప్రశ్నించారు. విద్యార్థులు బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ, స్కేటింగ్, రైఫిల్ షూటింగ్, వాలీబాల్, సైక్లింగ్, హాకీ వంటి క్రీడలకు అవసరమైన మైదానాలు, పరికరాలు కావాలని కోరారు. వీటిని పరిశీలించి అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.అంతర్జాతీయ స్థాయి క్రీడల వరకు వెళ్లే విద్యార్థులపై ప్రభుత్వం ఒక్కొక్కరిపై రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. కోచ్లు ఎంత శిక్షణ ఇచ్చినా, విద్యార్థుల్లో చిత్తశుద్ధి, అంకితభావం, స్వీయ క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు.రోజురోజుకు ఆలోచనలు మారుతాయని, వాటిని ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాలని,భవిష్యత్తు లో ఉద్యోగం గానీ, వ్యాపారం గానీ అవసరమైన సహాయాన్ని తప్పకుండా అందిస్తానని విద్యార్థులకు భరోసా ఇచ్చారు.సివిల్స్ చేయాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఎప్పుడైనా తాను అందుబాటులో ఉంటూఅవసరమైన మార్గనిర్దేశం, సలహాలు అందిస్తానని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిమ్నాస్టిక్ హాల్, క్రీడా మైదానాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. 


Comments