జిల్లాను అగ్రగామిగా నిలపాలి
-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
-సీఎం కప్ పోటీల్లో అధిక పతకాలు సాధించాలి
-2కె రన్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
సీఎం కప్ పోటీల్లో జిల్లా అగ్రగామిగా నిలబడి అధిక పతకాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాల భాగంగా 1 డిసెంబరు 2024 నుండి 9 డిసెంబరు వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మరియు అదనపు కలెక్టర్ సంధ్యారాణి కలిసి 2కె రన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ వరంగల్ నగరంలోని కాశీబుగ్గ జంక్షన్ నుండి ఓ సిటి స్టేడియం వరకు సాగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, క్రీడాకారులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, 7, 8 తేదీల్లో గ్రామస్థాయిలో, 10 నుండి 12వ తేదీ వరకు మండల స్థాయిలో, 16 నుండి 21వ తేదీ వరకు జిల్లా స్థాయిలో సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తదనంతరంగా, వారు జిల్లా స్థాయి క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన ప్యారాలింపిక్స్ గేమ్స్ లో జివాంజి దీప్తి మన జిల్లాకు పతకం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించాలని కలెక్టర్ ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి సత్యవాణి, డిపిఆర్ఓ ఆయూబ్ అలీ, పశు సంవర్ధక శాఖ అధికారి బాలకృష్ణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కైలాష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.


Comments