కార్తీక సోమవారం కీసరగుట్ట శివాలయం భక్తులతో కిటకిటలాడింది
కీసర, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా మేడ్చల్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్ట శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తజనులతో నిండిపోయింది. వేకువజామునుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారి దర్శనం పొందుతున్నారు."హరహర మహాదేవ శంభో శంకర" అనే శివనామస్మరణతో కీసరగుట్ట అంతటా మారుమ్రోగింది. ఆలయం లోపల, వెలుపల ఉన్న శివలింగాల వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తూ, తమ మనోకామనల నెరవేరాలని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.కార్తీక సోమవారం శివారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉన్నందున, భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. దేవస్థానం అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కార్తీకమాసం భక్తి, దీపారాధనతో కీసరగుట్ట పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం ఆకాశ దీపం చూసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొన్నారు.
ఆదివారం12 వేలకు పైగా భక్తులు స్వామివారి ని దర్శించుకున్నారని. భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు.గత ఏడాది తో పోలిస్తే ఈ సంవత్సరం కార్తీక మాసంలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు.


Comments