న్యాయవాదుల రక్షణ చట్టం అమలు వరకు పోరాటం కొనసాగుతుంది
అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. శ్రీనివాస్
పెబ్బేరు,నవంబర్11( తెలంగాణ ముచ్చట్లు):
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన చేపట్టిన ఛలో హైదరాబాద్ పాదయాత్ర మూడవ రోజు పెబ్బేరు చేరుకుంది.
ఈ సందర్భంగా వారికి మద్దతుగా అడ్వకేట్ నందిమల్ల త్రినాధ్ సంఘీభావం ప్రకటిస్తూ.. సుమారు 15 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్నారు.
శ్రీనివాస్ మాట్లాడుతూ..జోగులాంబ అమ్మ ఆశీస్సులతో న్యాయవాదుల రక్షణ చట్టం అమలు కోసం ఛలో హైదరాబాద్ పాదయాత్ర ప్రారంభించాం. గత రెండు రోజుల క్రితం అలంపూర్ కోర్టు వద్దనుండి యాత్ర మొదలుపెట్టాము,అని తెలిపారు. 
తాజా కాలంలో న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, న్యాయవాదులు వ్యక్తిగత కక్షలు లేకుండా ఇరు పక్షాల న్యాయం కోసం పనిచేస్తారు. అయినా కూడా వారి మీద దాడులు జరగడం తీవ్రంగా ఖండించదగ్గ విషయం, అని అన్నారు.
న్యాయవాదులపై దాడులు జరిగితే కోర్టు విధులను బహిష్కరించక తప్పదని, అందుకే రక్షణ చట్టం అత్యవసరమని పేర్కొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలులోకి వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మా డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్ వరకు పాదయాత్ర కొనసాగిస్తాము,అని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి, కొల్లాపూర్ ప్రాంతాల న్యాయవాదులు సంఘీభావం తెలియజేశారు. పెబ్బేరు సుభాష్ చౌక్ వద్ద సుభాష్ చంద్ర బోస్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.
కార్యక్రమంలో అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్ ప్రాంతాల సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


Comments