అద్దె భవనాల నుంచి శాశ్వత విద్యా కేంద్రాల దిశగా వనపర్తి
విద్యా రంగం బలోపేతమే లక్ష్యం – ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి,సెప్టెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి నియోజకవర్గంలో విద్యా రంగ అభివృద్ధికి మరో ముందడుగు వేయబడింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలకు అంగీకారం తెలిపారు.
అద్దె భవనాల్లో నడుస్తున్న పలు గురుకుల పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే మేఘారెడ్డి ముఖ్యమంత్రికి వివరించగా, సీఎం వెంటనే స్పందించి పాఠశాలలకు స్వంత భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు.
వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల పునరుద్ధరణ, పాలిటెక్నిక్ కళాశాల వెనుక వసతి గృహాల అభివృద్ధి, పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల, వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణాలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటాయి. తాత్కాలిక భవనాల్లో నడుస్తున్న మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల మరియు బాలుర పాఠశాలలకు శాశ్వత భవనాలు త్వరలోనే నిర్మాణానికి జీవోలు జారీ కానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ చర్యల ద్వారా వనపర్తి నియోజకవర్గంలో విద్యా రంగం మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే మేఘారెడ్డి విశ్వసిస్తున్నారు.


Comments