ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాం.!
ఖమ్మం ఆర్ టి సి రీజినల్ మేనేజర్ ఏ.సరిరాం.
సత్తుపల్లి, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
ఖమ్మం రీజియన్లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచినట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ.సరిరాం తెలిపారు. మంగళవారం సత్తుపల్లి డిపోను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుణ్యక్షేత్రాల దర్శన పేరుతో పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, భక్తులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శబరిమలై వెళ్లే అయ్యప్ప స్వాముల సౌకర్యం కోసం ఖమ్మం రీజియన్ పరిధిలో అన్ని డిపోల నుండి బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
అయ్యప్పలు వారు సూచించిన రూట్ ప్రకారం బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. యాత్ర దానం దాతలు ముందుకు వచ్చినట్లయితే ప్రత్యేక బస్సులను ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. యాత్రదానం విజయవంతం చేయడానికి దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ప్రయాణికుల రద్దీని బట్టి ఆయా రూట్లలో బస్సుల సంఖ్య పెంచినట్లు ఆయన తెలిపారు. వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన బస్సులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
సత్తుపల్లి బస్టాండ్ను పరిశీలించిన ఆయన, గ్యారేజ్ సిబ్బందితో సమావేశమయ్యారు. డిపో అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను డిపో మేనేజర్ ఊటుకూరి సునీతకు వివరించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక చర్యలు చేపడుతున్నట్లు కూడా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి డిపో మేనేజర్ ఊటుకూరి సునీత, అసిస్టెంట్ మేనేజర్ పి. విజయశ్రీ, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ సాహితి, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments