నాచారం ఐడీఏలో మహిళా కార్మికులు ధర్నా
వేధింపులు ఆపాలి ,కనీస వేతనం పెంచాలి , ఓటీ మొత్తం చెల్లించాలి
నాచారం, డిసెంబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు) :
నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ టెక్సటైల్స్ ఎక్స్పోర్ట్ యూనిట్ ఎదురుగా సోమవారం ఉదయం నుంచి సుమారు వెయ్యికి పైగా మహిళా కార్మికులు అకస్మాత్తుగా మెరుపు ధర్నా చేపట్టారు.పరిశ్రమలో జరుగుతున్న వేధింపులను అరికట్టాలని, కనీస వేతనం రూ.15,000 అమలు చేయాలని, చేసిన ఓవర్టైమ్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.కార్మికుల ఆందోళనకు సంఘీభావంగా సీఐటీయూ మాజీ జిల్లా అధ్యక్షుడు కోమటి రవి హాజరై మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానాలను దృష్టిలో ఉంచుకొని కనీస వేతనం రూ.26,000 కన్నా తక్కువ కావొద్దని పేర్కొన్నారు. తరువాత కార్మికుల సమక్షంలో హెచ్ఆర్ ప్రతాపరెడ్డి, మేనేజర్ స్వప్నతో చర్చలు జరిగాయి.ఓటీ బకాయిలను సమీక్షించి చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. వేధింపులపై విచారణకు అంగీకరించినా, వేతన పెంపు విషయంలో నిర్ణయం వెల్లడించలేదు.
ఈ సమాధానంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వేతనం పెంచే వరకు ధర్నా కొనసాగిస్తామని ప్రకటించారు.
అంతకుముందు యాజమాన్యంతో చర్చలకు వెళ్లిన కార్మిక సంఘం కమిటీ సభ్యులకు ప్రమోషన్ల రూపంలో ప్రలోభాలు ఇచ్చారని కార్మికులు ఆరోపించారు.ధర్నాకు సంఘీభావం తెలుపుతూ
సీఐటీయూ, ఏఐటీయూసీతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు సీఐటీయూ అశోక్ రెడ్డి, ఉపేందర్, ప్రభాకర్, ఏఐవైఎఫ్ గిరిబాబు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ స్వప్న, ఏఐఎస్ఎఫ్ హాజీమ్ తదితరులు పాల్గొన్నారు.


Comments