రైతు సమస్యలపై గళమెత్తిన రైతు సంఘం
స్వామినాథన్ సిఫార్సుల అమలుకు డిమాండ్
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి రాజిరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. కార్పొరేట్లకు, బహుళజాతి సంస్థలకు అనుకూలంగా చట్టాలు తెస్తోందని ఆరోపిస్తూ, ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
శనివారం స్థానిక ప్రైవేట్ విద్యాసంస్థలో తెలంగాణ రైతు సంఘం మండల నాలుగో మహాసభ కాయిత లింగారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజిరెడ్డి మాట్లాడుతూ కరోనా కాలంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతాంగ ఐక్య పోరాటాలతో రద్దు చేయించుకున్నామని గుర్తుచేశారు. ప్రస్తుతం తీసుకొస్తున్న విద్యుత్ సంస్కరణ చట్టం, విత్తన చట్టం పూర్తిగా రైతు వ్యతిరేకమైనవని అన్నారు.
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ముఖ్యంగా మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
అలాగే ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు సంఘం 9వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శీలం అశోక్, బాసిర సంపత్ రావు, కడిపికొండ రామ్ రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్, రామారావు, సంజీవరెడ్డి, కిరణ్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments