డిమాండ్ల సాధనకై పోరుబాటలో ఆర్టిసన్ కార్మికులు
ఐదు రోజులు గడిచినా చర్చలకు పిలుపు లేకపోవడంపై ఆగ్రహం
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్లో తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిసన్ అన్మ్యాన్ కార్మికులు సమ్మె బాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం, యాజమాన్యానికి పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు.
నాలుగు దఫాలుగా ధర్నాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం లేదా యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగారు. సమ్మె ప్రారంభమై ఐదు రోజులు గడిచినా ఇప్పటివరకు చర్చలకు పిలుపు రాకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లలో భాగంగా ఆర్టిసన్ కార్మికులకు ఏపీఎస్బీ రూల్స్ అమలు చేయాలని, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో పనిచేస్తున్న అన్మ్యాన్ కార్మికులను సంస్థలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.
ఇంకా, ఫీల్డ్ స్థాయిలో వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగేందుకు అన్మ్యాన్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, విధి నిర్వహణలో విద్యుత్ షాక్కు గురై మరణించిన కార్మికులకు ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్గ్రేషియా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే పీస్ రేటు కార్మికులకు జీఓ నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు.


Comments