క్వారీలో ఈతకు వెళ్లి యువకుడు మృతి
_బాల్ కోసం లోతులోకి వెళ్లి ప్రమాదం
– డిఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు తర్వాత మృతదేహం వెలికితీత
జవహార్ నగర , ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు)
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుంధతి నగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక యువకుడు వల్లపు మహేష్ (23) క్వారీలో ఈత కొట్టే క్రమంలో మునిగి మృతి చెందాడు.చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మహేష్, తన అమ్మమ్మ లింగమ్మ వద్ద నివసిస్తూ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఆదివారం సెలవు రోజు కావడంతో ఈతకు వెళ్తున్నానని చెప్పి స్నేహితులతో కలిసి సమీపంలోని క్వారీలోకి వెళ్లాడు. ఈత కొడుతూ ఉండగా నీటిలో కనిపించిన చిన్న బాల్ కోసం కొంత లోతులోకి వెళ్లగా, మహేష్ ప్రమాదవశాత్తు లోపలికి చిక్కుకుని మునిగిపోయాడు.స్నేహితులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, డిఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించారు. గాలింపు చర్యల అనంతరం మహేష్ మృతదేహాన్ని బయటికి తీశారు.అనంతరం 108 అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి మహేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మహేష్ అమ్మమ్మ లింగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో కాలనీ అంతా విషాదంలో మునిగిపోయింది.


Comments