మేడ్చల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు
_సమాజంలో సమానత్వం కోసం ఫూలే ఆశయాలను కొనసాగించాలి: అధికారులు
మేడ్చల్ మల్కాజ్గిరి, ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో జరిగింది.
కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి టి. ఝాన్సీ రాణి జ్యోతి ప్రజ్వలన చేసి మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఫూలే చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా టి. ఝాన్సీ రాణి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే సమాజంలో ఉన్న అన్యాయం, అసమానతల నిర్మూలన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని అన్నారు. ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఫూలే ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజానికి సేవ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పి. రాజేశ్వర్, సి. గంగాధర్ (సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారులు), రమేష్ గౌడ్ (స్టేట్ కన్వీనర్, బి.సి. జేఏసీ)తో పాటు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


Comments