కార్మిక హక్కుల కోసం ఐక్యంగా పోరాటం
అక్టోబర్ 25, 26న మేడ్చల్ జిల్లా సీఐటీయూ మహాసభలు
ఏ.ఎస్.రావు నగర్, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
కార్మిక వర్గ సమస్యలను చర్చించి, ఉద్యమ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేయడానికి సీఐటీయూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా 4వ మహాసభలు అక్టోబర్ 25, 26 తేదీల్లో చర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ హాల్లో జరగనున్నాయని జిల్లా అధ్యక్షుడు ఎ.అశోక్, కార్యదర్శి జె.చంద్రశేఖర్ తెలిపారు.శుక్రవారం కమలానగర్లోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ, అక్టోబర్ 25న డాక్టర్ ఏ.ఎస్.రావు నగర్ గ్రౌండ్ నుండి రౌండ్ బిల్డింగ్ వద్ద ఏపీఐఐసీ కాలనీ వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభ జరపనున్నట్లు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను హరించే ప్రయత్నమని వారు ఆరోపించారు. ఈ కోడ్స్ అమల్లోకి వస్తే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ప్రైవేట్, నిర్మాణ రంగ కార్మికులు పని గంటలు, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కులు వంటి అనేక హక్కులను కోల్పోతారని పేర్కొన్నారు. లేబర్ చట్టాలను రద్దు చేసి యజమానులకే అనుకూలంగా మార్చడం జరుగుతోందని విమర్శించారు.దీని ఫలితంగా వేతనాలు తగ్గడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, పెన్షన్ సౌకర్యం తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవు
తున్నాయని తెలిపారు. ప్రైవేటీ కరణ, కాంట్రాక్టు విధానం, నిరుద్యోగం వంటి అంశాలతో కార్మిక వర్గం తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని వారు విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ల కనీస వేతన జీ.ఓ లను సవరించక పోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవు తున్నారని తెలిపారు. కనీస వేతనం రూ.26,000గా నిర్దేశించాలని వారు డిమాండ్ చేశారు.ఈ మహాసభల్లో కనీస వేతనాలు, కాంట్రాక్ట్ కార్మికుల స్థిరీకరణ, సామాజిక భద్రత, పెన్షన్ హక్కులు, మహిళా కార్మికుల రక్షణ, అసంఘటిత రంగ కార్మికుల పరిరక్షణ వంటి అంశాలపై తీర్మానాలు ఆమోదించనున్నట్లు తెలిపారు.పరిశ్రమల్లో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు యూనియన్ స్థాయి అవగాహన, సంఘటిత పోరాటం అవసరమని వారు హైలైట్ చేశారు. వేలాది కార్మికులను సంఘటితం చేయడం ఈ మహాసభల ప్రధాన లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి జి.శ్రీనివాసులు, కోశాధికారి ఉన్నికృష్ణ, ఉపాధ్యక్షులు పి.గణేష్, బి.వి.సత్యనారాయణ, ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments