సర్జరీ అనంతరం మృతి చెందిన ఏఆర్ పిసి చరణ్ కుమార్
రాచకొండ సీపీ సుధీర్ బాబు నివాళులర్పణ
హైదరాబాద్, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
రాచకొండ కమిషనరేట్కు చెందిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు కానిస్టేబుల్ వి. చరణ్ కుమార్ (34) అనూహ్యంగా మరణించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీ జి ఏ బి ఎన్)లో డిప్యూటేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన, ఇటీవల ముంబై ఆపరేషన్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.సెప్టెంబర్ 23న జరిగిన ఆ ప్రమాదం లో చరణ్ కుమార్ కాలి శిన్ బోన్ విరిగిపోయింది. మొదట స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన గాయం మానకపోవడంతో,మలక్పేట్ యశోద ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించారు.
అక్కడ వైద్యులు చిన్న సర్జరీ అవసరమని సూచించడంతో అక్టోబర్ 16 మరియు 24 తేదీలలో రెండు సర్జరీలు చేశారు.అక్టోబర్ 24న మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆయనను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి చేరుకున్న కొద్ది సేపటికే సుమారు మధ్యాహ్నం1.45 గంటల సమయంలో మూర్ఛపోయి పడిపోవడంతో, కుటుంబ సభ్యులు వెంటనే మళ్లీ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయనను డాక్టర్లు మృతుడిగా ప్రకటించారు.చరణ్ కుమార్ ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరుల్లో తీవ్ర విషాదాన్ని నెలకొలిపింది. ఆయన వయస్సు 34 సంవత్సరాలు. వెనుక భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.మరణవార్త తెలిసిన రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ బుధవారం రోజు యశోద ఆసుపత్రికి వెళ్లి చరణ్ కుమార్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి పోలీస్ శాఖ తరఫున అన్ని విధాల సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.


Comments