సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో వైభవంగా బతుకమ్మ సంబరాలు.
సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థినులు – బతుకమ్మ పాటలతో మార్మోగిన ప్రాంగణం.
సత్తుపల్లి, సెప్టెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం, బి గంగారం గ్రామంలో సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. బిటెక్, డిప్లొమా, యంబిఎ విద్యార్థినులు, విద్యార్థులు, మహిళా సాధికారత సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.

"బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో…" వంటి పాటలతో కళాశాల ప్రాంగణం మార్మోగింది. విద్యార్థినులు తెలంగాణ సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని బతుకమ్మలకు నైవేద్యం సమర్పించారు. రంగురంగుల పూలతో కళాశాల ఆవరణ అలంకరించబడింది.
ప్రిన్సిపాల్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ, “తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా విద్యార్థులు, మహిళా ఉద్యోగినులు బతుకమ్మ పండుగను జరుపుకోవడం మంచి సంప్రదాయం” అని అభిప్రాయపడ్డారు.
సెక్రటరీ, కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, “బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రత్యేకత. ప్రకృతి, ఆత్మీయతలు, జీవనశైలిని ప్రతిబింబించే బతుకమ్మ పాటలు సాంస్కృతిక అస్తిత్వానికి నిదర్శనం. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ సంప్రదాయాలకు ప్రతీక” అని వివరించారు.
కార్యక్రమంలో మహిళా సాధికారత సంస్థ చైర్పర్సన్ రాచమళ్ళ శ్రీదేవి, కన్వీనర్ లీలావతి, ట్రస్టీ కిరణ్రంజిని, సభ్యులు రాజకళ, సుధారాణి, ప్రతిమ, రాణి, సత్యవేణి, నాగలక్ష్మి పాల్గొన్నారు.
బతుకమ్మ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థినులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రిన్సిపాల్ చేతుల మీదుగా అందజేశారు. వేడుకలో విభాగాధిపతులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


Comments