సెలవుల వేళ అప్రమత్తంగా ఉండాలి.!
కోళ్ల పందేలు, జూదంపై కఠిన చర్యలు. - సీఐ టి శ్రీహరి.
సత్తుపల్లి, డిసెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
రాబోయే డిసెంబర్ 31, సంక్రాంతి పండుగల సందర్భంగా వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సత్తుపల్లి సీఐ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండుగలకై స్వగ్రామాలకు వెళ్లే సమయంలో ఇండ్లకు తాళాలు వేసి, ఇంట్లో ఎలాంటి విలువైన ఆభరణాలు లేదా నగదు ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఖాళీగా వదిలే ఇండ్ల వివరాలను ముందుగా పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు. అలాగే పండుగల సందర్భంగా ఎవరైనా కోళ్ల పందేలు నిర్వహించినా, కోళ్లకు కత్తులు కట్టినా, జూద శిబిరాలు ఏర్పాటు చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోళ్ల పందేలు లేదా జూదం నిర్వహించిన వారితో పాటు పాల్గొన్న వారిపై కూడా పోలీస్ స్టేషన్లో ప్రత్యేక నిఘా షీట్లు తెరవడంతో పాటు బైండ్ ఓవర్ చర్యలు చేపడతామని తెలిపారు.
పండుగల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి అక్రమ కార్యకలాపాలను సహించేది లేదని, ప్రజలు పోలీసులకు సహకరించి పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ విజ్ఞప్తి చేశారు.


Comments