వరి కొయ్యలు కాల్చటం భూమికి రైతుకూ నష్టమే
వైరా ఏడిఏ తుమ్మలపల్లి కరుణశ్రీ.
ఖమ్మం బ్యూరో ,నవంబర్ 26, తెలంగాణ ముచ్చట్లు;
వరి కోతల అనంతరం మిగిలిపోయిన వరి కొయ్యలను రైతులు కాల్చటం వలన భూమిలో ఉండే సూక్ష్మ జీవులు చనిపోయి కర్బన శాతం పెంచే ప్రక్రియ తగ్గిపోతుందని వైరా డివిజన్ వ్యవసాయ సంచాలకులు తుమ్మలపల్లి కరుణశ్రీ రైతులకు వివరించారు. బుధవారం వైరా మండలం లోని నారపనేని పల్లి గ్రామం వరి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వరి కొయ్యల కాల్చివేత పై అవగాహన కల్పించారు. కాల్చటం రైతులకు తేలికైన పనే అయినా, భూమి గొడసబారటం,పర్యావరణ సమతుల్యత దెబ్బ తినటం జరుగుతుందన్నారు. వరి కోతల తర్వాత రెండు మూడు రోజులు నీటిలో నాన బెట్టిన భూమిని సింగిల్ సూపర్ పాస్పేట్ చల్లి కలియ దున్నుకుంటే తర్వాత పంటకు పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుందని వివరించారు.అంతే గాక కర్బన శాతం పెంచుతుందని అన్నారు. విత్తన మొక్క జొన్న సాగు చేసే రైతులు విత్తన కంపెనీ లతో ఎగ్రిమెంట్ చేసుకుని సాగుచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారి మయాన్మంజూఖాన్,ఏఈ ఓ కీర్తి, రైతులు గారపాటి గోపాలరావు, వల్లభనేని శ్రీనివాసరావు, గాంధీ, పెన్మత్స వెంకటపతి రాజు, రంజిత్, రవి, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.


Comments