కమలానగర్లో కుల నిర్మూలన సాంస్కృతోత్సవాలు
_పాటల పోటీల ద్వారా సమానత్వ సందేశం
ఏ ఎస్ రావు నగర్ , ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతుల సందర్భంగా కుల నిర్మూలన సాంస్కృతోత్సవాల భాగంగా సోమవారం కమలానగర్ ఆఫీసు ఆవరణలో “కుల నిర్మూలన” అంశంపై పాటల పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రారంభంగా గురజాడ అప్పారావు రచించిన దేశభక్తి గీతాన్ని బొమ్మగాని రుక్కయ్య ఆలపించారు. ప్రముఖ గాయని ఆశాభోస్లే మరణానికి సంతాప సూచకంగా కొద్దిసేపు మౌనం పాటించారు.ఈ సందర్భంగా యాదగిరిరావు మాట్లాడుతూ, కుల వ్యవస్థ శతాబ్దాలుగా సమాజాన్ని విభజించి శ్రామిక వర్గాలను బానిసలుగా మార్చిందని అన్నారు.కుల వివక్షను పూర్తిగా నిర్మూలించనంత కాలం దేశం పురోగమించదని, సమానత్వ సమాజం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ముఖ్య అతిథి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, కులం భూస్వామ్య సమాజపు దుష్ట వ్యవస్థగా నిలిచి అసమానతలకు కారణమైందని తెలిపారు.దానిని అంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.అమ్మ ఫౌండేషన్ బాధ్యుడు గంజి ఈశ్వర లింగం మాట్లాడుతూ, మరణానంతరం అవయవ దానం, నేత్రదానం వంటి సేవలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని వివరించారు.పాటల పోటీల్లో బొమ్మగాని సోమయ్య, పాండు, కోటేశ్వరరావు, నరసింహారావు, రుక్కయ్య, సిహెచ్ లీలావతి, దువా కిరటి, నవతెలంగాణ రవి, షణ్ముఖం, ఎం భాస్కర్ రావు తదితరులు కుల వివక్షపై పాటలు, పద్యాలు, కవితలు వినిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఉదయ్ కుమార్ సందేశం ఇచ్చారు.ముగింపులో పాల్గొన్న కళాకారులకు చేనేత కండువాలతో పాటు రామిశెట్టి రోశయ్య రచించిన “నాదే కులం”, “ప్రపంచీకరణ” పుస్తకాలను బహుమతులుగా అందజేశారు.స్ఫూర్తి గ్రూప్ యువ నాయకుడు గిరీష్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments