స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో దంత వైద్య శిబిరం
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
స్థానిక స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో గురువారం పాఠశాల చిన్నారులకు దంత వైద్య శిబిరం ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులకు వారి దంతాలను వైద్యులకు క్షుణ్ణంగా పరిశీలించి దంత సంరక్షణ పట్ల అవగాహన కల్పించారు. స్థానిక మమత దంత వైద్య కళాశాల వైద్యులు పాఠశాల చిన్నారుల పళ్ళు వరుసలను పరిశీలించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అవసరమైన వారికి వైద్యులు చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్య నిపుణులు చిన్నారులకు పలు దంత సలహాలను తెలియజేశారు. చాక్లెట్లు, రంగురంగుల తినుబండారాలను తినడం వలన దంతాలకు హాని జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం దంతాలను పరిశుభ్రం చేసుకున్న తర్వాతనే ఏవైనా తినాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనపు కృష్ణ చైతన్య మాట్లాడుతూ శరీర ఆరోగ్యానికి దంత సంరక్షణ కీలకమని తెలిపారు. అందుకే పాఠశాల విద్యార్థులు ప్రతిరోజు దంతాలను సంరక్షించుకోవడంలో బాధ్యత
గా వ్యవహరించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల దంత సంరక్షణ పట్ల జాగ్రత్తలు పాటించినప్పుడే పిల్లల ఆరోగ్యం ఉత్తమంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతని సుకన్య,ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Comments