మనో సంకల్పం ముందు వైకల్యం అవరోధం కాదు
హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవనంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య పాల్గొని, “మనో సంకల్పం ముందు వైకల్యం అవరోధం కాదు” అనే సందేశాన్ని అందించారు.
జీవితంలో ఎదురయ్యే వైకల్యాలను అవరోధంగా భావించకుండా, భవిష్యత్ పట్ల దృష్టి సారించి ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సామాజికంగా మరియు ఆర్థికంగా దివ్యాంగుల అభ్యున్నతి కోసం పలు కార్యక్రమాలు అమలులో ఉన్నాయని, అందుకు ప్రైవేట్ రంగాలతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దివ్యాంగుల కోసం ర్యాంపు వంటి సౌకర్యాలను ప్రభుత్వ కార్యాలయాల్లో కల్పించాలన్న నిబంధనల అమలుపై అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి జె. జయంతి వివిధ పథకాల గురించి వివరించగా, తెలంగాణ మైనార్టీ కమిషన్ సభ్యుడు సర్దార్ దర్శన్ సింగ్ దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్య, ఉపాధికి ప్రోత్సాహం
ప్రి, పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాలు, స్వయం ఉపాధి పథకాలు, వివాహ ప్రోత్సాహక బహుమతులు, ఉపాధి శిక్షణలు వంటి కార్యక్రమాలను దివ్యాంగుల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
సాంస్కృతిక ప్రదర్శనలు, బహుమతులు ఈ సందర్భంగా బన్ను, మల్లికాంబ, స్పందన, అతిథి వంటి సంస్థల చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోగా, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడల్లో విజేతలైన దివ్యాంగులకు కలెక్టర్ పి. ప్రావిణ్య బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో ఆర్జేడీ ఝాన్సి లక్ష్మి బాయి, డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు కే. అనితారెడ్డి, ప్రముఖ కవి బిల్ల మహేందర్, డాక్టర్ వెంకట్ రాం రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు,తదితరులు పాల్గొన్నారు.


Comments