త్వరలో రేషన్ కార్డులో కొత్త పేర్ల ఎంట్రీ ..?
-త్వరలో నమోదు ప్రక్రియ
-తీరనున్న కొత్త పేర్ల ప'రేషన్'
డెస్క్ ,తెలంగాణ ముచ్చట్లు:
ఒక కుటుంబానికి కార్డుంది.. రేషన్ మాత్రం భార్యాభర్తలకే వస్తోంది.. వారి ఇద్దరు పిల్లలకు రావట్లేదు. మరో కుటుంబంలో మెట్టినింట రేషన్కార్డులో కోడలి పేరు చేరలేదు. అలాగని పుట్టినింట కార్డులోనూ లేదు. పెళ్లయి అత్తారింటికి వెళ్లాక ఆమె పేరును పుట్టింటి కార్డులోంచి తొలగించారు... సంవత్సరాలుగా ఉన్న ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనున్నట్లు పౌరసరఫరాలశాఖ వర్గాల సమాచారం. రేషన్కార్డుల్లో అర్హులైన కొత్త కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిసింది. "ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశం కొలిక్కి రాగానే ఈ విషయంపై కీలక నిర్ణయం ఉంటుంది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత నూతన రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది' అని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో 11.08 లక్షల దరఖాస్తులు
రేషన్ కార్డుల్లో అర్హుల పేర్లను చేర్చాలని రాష్ట్రంలో లక్షల
కుటుంబాలు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో పౌరసరఫరాల శాఖ ఇన్నాళ్లూ వాటిని పరిశీలించలేదు.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11.08 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిని ఆమోదిస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందన్న విషయంపై అధికారులు నివేదిక ఇచ్చారు.నెలకు సుమారు 9,890 టన్నుల బియ్యం అదనంగా కావాల్సి ఉంటుందని.. రూ.37.40 కోట్ల భారం పడుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేసినట్లు తెలిసింది. తొలుత ఫ్యామిలీ డిజిటల్ కార్డులు వచ్చాక.. ప్రస్తుత రేషన్ కార్డులు, అందులోని లబ్ధిదారుల సమాచారం అంతా అందులో చేరిపోయేలా సాఫ్ట్వేర్ను
రూపొందించనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో రేషన్ దుకాణానికి వెళ్లి అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. ఆ కుటుంబానికి ఏ సరకులకు, ఎంత పరిమాణానికి అర్హత ఉంది అన్న వివరాలు తెలిసిపోతాయి. ఆ మేరకు రేషన్ ఇస్తారు. తర్వాత అర్హత కలిగిన కుటుంబ సభ్యులను చేర్చే దరఖాస్తుల్ని పరిశీలించి ఆమోదిస్తే.. వారి సమాచారం కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో చేరిపోతుందని పౌరసరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి.


Comments