డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అందరూ ముందుకు రావాలి పట్నం మహేందర్ రెడ్డి
మేడ్చల్-మల్కాజిగిరి, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు)
డ్రగ్స్ రహిత తెలంగాణను సాధించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా ఉండాలని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఉప్పల్, నాచారం, ఘట్కేసర్ ప్రాంతాల్లో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కాప్రా ఆబ్కారి (ఎక్సైజ్) పోలీస్ స్టేషన్లను ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి, ఎక్సైజ్ ఈఎస్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 14 కొత్త పోలీస్ స్టేషన్లను మంజూరు చేసిందని తెలిపారు. కొత్తగా నిర్మించబడనున్న అబ్కారీ స్టేషన్లకు స్థలాల కేటాయింపు, భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామని చెప్పారు.గంజాయి, డ్రగ్స్ ముఠాలను సమూలంగా నిర్మూలించేందుకు ఎక్సైజ్ వ్యవస్థను మరింత శక్తివంతం చేయడం అత్యవసరమని అన్నారు. మద్యం అక్రమ రవాణా, కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు.


Comments