పోలీస్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నవరాత్రులు జరుపుకుందాం
పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
వరంగల్,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
రాబోయే వినాయక చవితి సందర్భంగా ట్రైసిటీ పరిధిలో ఏర్పాటు చేయబోయే గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. గణేష్ ప్రతిమల ఎత్తు, ఏర్పాటు చేసే ప్రదేశం, నిమజ్జనం తేదీ, ప్రదేశం వంటి పూర్తి వివరాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారని తెలిపారు.
మండపాల ఏర్పాటు ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని, స్థల యజమాని లేదా సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్లు అధికార అనుమతులతోనే తీసుకోవాలి. షార్ట్ సర్క్యూట్ సమస్యలు రాకుండా నాణ్యమైన వైరును వాడాలని, మండపాలలో బాధ్యుల వివరాలు, కమిటీ సభ్యుల ఫోన్ నంబర్లు ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృద్ధులు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తక్కువ శబ్ద కాలుష్యంతో స్పీకర్లు వాడాలని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. మండపాల్లో డీజే వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.
అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యగా రెండు బకెట్ల నీళ్లు, ఇసుక తప్పనిసరిగా ఉంచాలని కమిషనర్ సూచించారు. మద్యం సేవించడం, పేకాట, లక్కీ డ్రాలు, అసభ్యకర నృత్యాలు, ఇతర మతాలను కించపరిచే ప్రసంగాలు, పాటలు కఠినంగా నిషేధమని పేర్కొన్నారు. మండపాల్లో 24 గంటలు వాలంటీర్లు ఉండేలా చూడాలని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
మండపాల్లో ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనిపించిన వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు. పోలీసుల తనిఖీల కోసం పాయింట్ పుస్తకం తప్పనిసరిగా ఉంచుకోవాలని, అధికారులు పరిశీలించి అందులో సంతకం చేస్తారని తెలిపారు. అన్ని నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో పాటు నిబంధనలు పాటించి గణేష్ నవరాత్రులను శాంతియుతంగా, విజయవంతంగా జరుపుకోవాలని కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు.


Comments