ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలి
హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్
-వైభవంగా ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలు
-అలరించిన సాంస్కృతిక సారథి కళాకారుల ఆటాపాట
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)రాథోడ్ రమేష్ అన్నారు. బుధవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనకు ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమం లో భాగంగా హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్డీవో రాథోడ్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ విజయోత్సవాలు కార్యక్రమాన్ని ఆర్డీవో రాథోడ్ రమేష్ హనుమకొండ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి గంగవరపు వెంకట భానుప్రసాద్, ఇతర అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తీసుకువచ్చిందన్నారు. రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ప్రజల సంక్షేమానికి గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు పథకాన్ని అమలు చేస్తుందని, రూ. 500లకే వంట గ్యాసు పథకం అందిస్తుందన్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి గంగవరపు వెంకట భానుప్రసాద్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కళాకారులు తమ ఆటాపాటలు, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారని అన్నారు.
ఈ విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రజా పాలన లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను తమ ఆటాపాటలతో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు అంతడుపుల నాగరాజు బృందం ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కళాకారులు చక్రాల రఘు, బృందం తమ ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు.


Comments