ఆర్గానిక్ పంటలతోనే ఆరోగ్యమైన తెలంగాణ సాధ్యం
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి – రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
వనపర్తి, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
గద్వాల్ పట్టణ కేంద్రంలోని బ్రహ్మకుమారీస్ ఆశ్రమంలో మంజుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్గానిక్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్వకాలంలో రైతులు పశువుల పేడతో సహజంగా పంటలు పండించేవారని, అయితే నేటి కాలంలో పశువుల సంఖ్య తగ్గిపోవడంతో రసాయన ఎరువులపై ఆధారపడి పంటలు పండిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ రాష్ట్రంలో ప్రభుత్వం ఆవుపేడను మహిళా సంఘాల ద్వారా సేకరించి రైతులకు అందజేసి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించిందని ఆయన గుర్తుచేశారు.
భారత జనాభా పెరుగుదలతో కొత్త రకాల వంగడాలను దిగుమతి చేసుకొని అధిక దిగుబడి కోసం రైతులు రసాయన ఎరువులపై ఆధారపడ్డారని అన్నారు. రైతు పక్షపాతి పార్టీగా కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఉచిత కరెంటు, రుణమాఫీ, సబ్సిడీల ద్వారా రైతులను ఆదుకున్నదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమం కోసం చేసిన కృషిని స్మరించుకుంటూ, ఉత్తమ సేంద్రియ రైతు పాలేకర్కు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేసి సత్కరించిందని తెలిపారు.
“సేంద్రియ వ్యవసాయం చేయడానికి పాడి పరిశ్రమ అనివార్యం. రైతులు ఆర్గానిక్ పద్ధతులను అవలంబిస్తే రోగాలు తగ్గి, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు” అని డా. చిన్నారెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ రెడ్డి, అయ్యప్ రెడ్డి, అరుంధతి, వనపర్తి మాజీ జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, గద్వాల్ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకటేష్, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు


Comments