ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయి పర్యటన
తూముకుంట మున్సిపాలిటీలో పరిశీలన
– నాళాల ఆక్రమణలు తొలగించాలని ఆదేశం
హైడ్రాబాద్,అక్టోబర్8(తెలంగాణ ముచ్చట్లు):
ప్రజావాణి ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్ బుధవారం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. దేవరాయాంజాల్ గ్రామంలోని సర్వే నంబర్లు 135, 136ల్లో రహదారి మార్గంలో ఉన్న వివాదాస్పద ప్రాంతాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ఆ ప్రాంతంలో కొత్తగా కోర్టు భవనం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో రహదారిని వెంటనే పునరుద్ధరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం దేవరాయాంజాల్ చెరువుకు వెళ్లే వరద కాలువ ఆక్రమణలను కూడా పరిశీలించారు.
వరద కాలువ ఆక్రమణలు తొలగించాలని ఆదేశం
తుర్కవాణి కుంట నుంచి దేవరాయాంజాల్ చెరువుకు వెళ్లే వరద కాలువ కబ్జా కావడం వల్ల నాలుగు కాలనీలు వరద ముప్పులో ఉన్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రంగనాథ్ గ్రామ రికార్డులు, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఎస్సి మ్యాపుల ఆధారంగా కాలువ అసలు విస్తీర్ణాన్ని నిర్ధారించి ఆక్రమణలు తొలగించి పునరుద్ధరణ చేపట్టాలని ఆదేశించారు.
తరువాత తూముకుంట గ్రామంలోని వాసవి సుచిర్ ఇండియా లేఅవుట్లో నాలా కుంచించుకుపోయిన అంశాన్ని ఆయన పరిశీలించారు. దేవరాయాంజాల్ చెరువు, పోతాయిపల్లి చెరువు నుంచి గుండ్లకుంట చెరువుకు వెళ్లే వరద కాలువ 9 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిన చోట కేవలం 2 మీటర్లకు మాత్రమే పరిమితం చేయడంతో పరిసర ప్లాట్లు, ఇళ్ల ప్రాంతాలు నీట మునుగుతున్నాయని నివాసులు వివరించారు. ఇటీవల వర్షాలకు మునిగిపోయిన వీడియోలను వారు కమిషనర్కు చూపించారు. ఓపెన్ నాలా బదులు పైపులు వేయడం వల్లే సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు.
ఈ అంశంపై ఇరిగేషన్, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీ అధికారులతో పాటు వెంచర్ యజమానులతో త్వరలో సమావేశం నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో హైడ్రా అదనపు కమిషనర్ ఎన్.అశోక్కుమార్, అదనపు సంచాలకుడు వర్ల పాపయ్య తదితర అధికారులు కమిషనర్తో ఉన్నారు.


Comments