అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సాగిన కేసీఆర్ పదేళ్ల పాలన
–మాజీ ఎంపీ నామ
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 13(తెలంగాణ ముచ్చట్లు )
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కట్టుబడి కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో అంబేద్కర్ స్ఫూర్తి కీలకమని పేర్కొంటూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టడం, అలాగే హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఆచరణలో చూపించిందని చెప్పారు. రైతులకు రైతుబంధు, దళిత, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినట్టు వివరించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా దళితబంధు వంటి విప్లవాత్మక పథకాన్ని ప్రవేశపెట్టి దళిత వర్గాల ఆర్థిక పురోగతికి దోహదపడిందని తెలియజేశారు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ హాయంలోనే అత్యధిక సంఖ్యలో గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేసి, దళిత బహుజన పిల్లలకు ఉచిత విద్యను అందించి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ ఆదేశాల మేరకు 17వ లోక్సభలో తన వంతు కృషి చేసినట్లు నామ నాగేశ్వరరావు వెల్లడించారు.


Comments