మంత్రి పదవి కోసం మాలల ఉద్యమం
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి విమర్శ
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్పై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ధర్మసాగర్ మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, వివేక్ మాలల ఉద్యమాన్ని మంత్రి పదవి కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నాడని ఆరోపించారు.
తెలంగాణలో మాదిగ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, వివేక్ దీనికి వ్యతిరేకంగా మాలల ఉద్యమం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వివేక్, నాగరాజులు వ్యతిరేకంగా వ్యవహరించడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని, వీరిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
పదవుల కోసం వివేక్ అన్ని పార్టీలను సంప్రదించిన వ్యక్తి అని వ్యాఖ్యానించిన ఉపేందర్, స్వార్థపూరిత రాజకీయాలకు మాదిగల ఉద్యమాన్ని అడ్డుపెట్టుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి కోసం ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, మాదిగలకు అన్యాయం జరిగితే వారి సత్తా ఏమిటో ప్రభుత్వానికి చూపుతామన్నారు.ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఉపేందర్ హెచ్చరించారు.


Comments