మంత్రి తుమ్మలతో అశ్వరావుపేట ప్రజాప్రతినిధుల భేటీ.
దమ్మపేట, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని గండుగులపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ నాయకత్వంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల వారికి అభినందనలు తెలియజేస్తూ శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అశ్వరావుపేట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న అశ్వరావుపేటకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కృషి చేయాలని తెలిపారు. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజల సమస్యలను సమయానికి పరిష్కరించడం ద్వారా ప్రజాభిమానాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి లబ్ధిదారుడికి చేరేలా చూడాలని ఆదేశించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ పారదర్శకతతో ముందుకు సాగాలని, స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కూడా పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments