సత్తుపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన: ఎమ్మెల్యే మట్టా
సత్తుపల్లి, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మట్టా రాగమయి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించడంతో పాటు, చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై ప్రత్యక్షంగా సమాచారం సేకరించారు.
తనిఖీ సందర్భంగా ఆసుపత్రి లో పరిశుభ్రత లోపాలు గమనించి తక్షణమే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులకు ఇచ్చే ఆహార నాణ్యత, శానిటేషన్, వాష్రూమ్ నిర్వహణ వంటి అంశాలపై కూడా సూచనలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందన వేగం పెంచాలని ఎమర్జెన్సీ విభాగం అధికారులను కోరారు.
తదుపరి, నిర్మాణంలో ఉన్న 100 పడకల కొత్త ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రావాల్సి ఉన్న నేపథ్యంలో పనులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పరికరాలు, మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.
ఆరోగ్య రంగ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్య రంగమని, ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేసినట్టు సమాచారం.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ నరసింహ, కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Comments