కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై నన్నపునేని నరేందర్ ఫైర్
-తెలంగాణ తల్లికి పాలాభిషేకం బిఆర్ఎస్ నాయకులు
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యుడు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ తూర్పు లోని ఖిలా వరంగల్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడంపై భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసిన నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ, “సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను దిగువ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డల మనోభావాలను కించపరిచే విధంగా ఆయన పరిపాలన ఉందని” ఆరోపించారు. “కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కి పరిమితం చేయడమే ఖాయం” అని పేర్కొన్నారు.
అంతేకాకుండా “కాకతీయ తోరణం, చార్మినార్ ను మార్చడం కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం మీద దృష్టి పెట్టండి. స్థానిక మంత్రి వేములవాడ రాజన్న స్వామి వారి కోడెల కోతకు అనుమతి ఇవ్వడం కూడా వరంగల్ తూర్పు ప్రజలకు అవమానంగా ఉంది” అని ఘాటుగా స్పందించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, మారుపల్ల రవి, ముఖ్య నాయకులు, మహిళా నాయకురాలు, యూత్ నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Comments