ఆయిల్ పామ్ సాగులో రైతులను ప్రోత్సహించాలి
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగును విస్తరించేందుకు రైతులను మరింతగా ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమావేశంలో ఉద్యాన, వ్యవసాయ, పట్టు పరిశ్రమ శాఖల అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ పంట ప్రాముఖ్యతను రైతులకు తెలియజేస్తూ, అధిక విస్తీర్ణంలో సాగు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ఆయిల్ పామ్ పథకం ఈ సంవత్సరంతో ముగియనున్న నేపథ్యంలో, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
మండలాల వారీగా ఆయిల్ పామ్ సాగు స్థితిగతులపై ఉద్యాన శాఖ అధికారులు నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా సెరికల్చర్ రంగంలో ప్రగతి సాధించాలన్న దిశగా సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచనలు ఇచ్చారు.అలాగే ఈ సమావేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగు, పంటల నమోదు, రైతు బీమా, పీఎం కిసాన్ లబ్ధిదారుల అంశాలపై కూడా సమీక్ష జరిగింది. అనంతరం ఉద్యాన శాఖ ద్వారా రూపొందించిన బుక్లెట్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనసూయ, సెరికల్చర్ అధికారులు సంజీవరావు, వెంకన్నలతో పాటు మండల వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.


Comments