నైపుణ్యాభివృద్ధితోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు
ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వీణ జోషి
పెద్దమందడి,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థులు తమ తమ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి చేసుకుంటేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వీణ జోషి అన్నారు. శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 11వ సంస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజురోజుకు తగ్గిపోతున్న సహజ వనరులు, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో నేల, నీరు, పంటల సాగులో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఎంతో అవసరమని తెలిపారు.ఉద్యోగాల కల్పన పూర్తిగా విద్యార్థుల నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.వర్టికల్ ఫార్మింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, మైక్రో ఇరిగేషన్ వంటి ఆధునిక రంగాల్లో మానవ వనరుల అవసరం అధికంగా ఉందని తెలిపారు.పెట్టుబడి ఖర్చులు తగ్గించే సాంకేతికతలు, నూతన వంగడాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని, ఆ దిశగా శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి రావుల విద్యాసాగర్ మాట్లాడుతూ, పామాయిల్ సాగుతో సంవత్సరం పొడవునా ఉపాధి లభించడంతో పాటు రైతుల ఆదాయ వనరులు పెరుగుతాయని అన్నారు.అలాగే సూక్ష్మసేద్యాన్ని రైతులు అవలంబిస్తే నీటి వినియోగ సామర్థ్యం మరింత పెరుగుతుందని వివరించారు.కార్యక్రమంలో భాగంగా శ్రీ కొండ లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఆయన సేవలను స్మరించుకున్నారు.విశ్వవిద్యాలయం సాధించిన విజయాలపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు.వివిధ మోడళ్లపై బీ.ఎస్.సీ. హార్టికల్చర్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఓఎస్ఏ డాక్టర్ శంకర స్వామి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కళాధర్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షహనాజ్, డాక్టర్ మాధవి, నవ్వే శ్వేతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.


Comments