ఎఫ్ఆర్ఎస్ విధానంలో విద్యార్థుల నమోదు చేయాలి
-హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: పాఠశాల విద్యార్థుల నమోదును ఆన్లైన్లో ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం- ఎఫ్ఆర్ఎస్)ను ఉపాధ్యాయులు తప్పనిసరిగా నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలోని తరగతులను పరిశీలించారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ఇచ్చారా అని ప్రధానోపాధ్యాయుడిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా విద్యార్థులతో మధ్యాహ్న భోజనం గురించి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ఆర్ఎస్ విధానంలో పాఠశాలకు వచ్చిన విద్యార్థుల నమోదు చేస్తున్నారా అని కలెక్టర్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ విధానంలో విద్యార్థుల నమోదు చేస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రతిరోజు ఎఫ్ఆర్ఎస్ విధానంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నమోదు చేయాలన్నారు. మెనూ ప్రకారం పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, కాజీపేట తహసీల్దార్ భావు సింగ్, ఎంఈఓ మనోజ్ కుమార్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు


Comments