విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించేలా బోధన సాగాలి
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరచే విధంగా బోధన పద్ధతులు ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం ఐనవోలు మండలంలోని మరియపుర గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, మూడో, ఐదో తరగతి విద్యార్థులతో పాటు తొమ్మిదో, పదో తరగతి విద్యార్థులకు గణిత సంబంధిత ప్రశ్నలు వేశారు. విద్యార్థుల ప్రతిస్పందనను పరిశీలించారు. బోర్డుపై ప్రశ్నలు రాయించి వారి అభ్యాస స్థాయిని ఆవగాహన చేసుకున్నారు. బోధనా విధానాన్ని గమనించిన కలెక్టర్, ఉపాధ్యాయులకు పాఠ్యాంశం బోధన విధానం మెరుగుపరచాలని సూచించారు.
తర్వాత పాఠశాలలకు సంబంధించిన రికార్డులను, వంటగదిని పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం తయారీ జరుగుతున్నదో లేదో వంట కార్మికులు, ఉపాధ్యాయులను ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందేలా చూడాలని ఆదేశించారు. అలాగే తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
అంతకుముందు ఐనవోలు మండలం సింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న చిన్నారుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. తల్లులు, గర్భిణీలతో మాట్లాడిన కలెక్టర్, గ్రామంలోని చిన్నారులు ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు వెళ్తున్నారో స్థానికులను ప్రశ్నించారు.అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందుతుందని, ఐదేళ్ల లోపు పిల్లలను అక్కడ చేర్పించాలని సూచించారు. అలాగే, గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా లభించే పౌష్టికాహారాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద, ఎంఈవో ఆనందం, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Comments