ఈ నెల 5,6న తెలంగాణ శ్రామిక మహిళ రాష్ట్ర సదస్సు
కీసరలో గోడపత్రిక ఆవిష్కరించిన సంస్థ ప్రతినిధులు
కీసర, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలు, ఉద్యోగ భద్రత అంశాలపై చర్చించేందుకు తెలంగాణ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ రాష్ట్ర 5వ సదస్సు అక్టోబర్ 5, 6న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని వినయ్ గార్డెన్స్లో జరగనుంది. ఈ సదస్సులో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు మేడ్చల్ జిల్లా కన్వీనర్ ఎం. రేవతి కళ్యాణి తెలిపారు.శుక్రవారం కీసరలో ఆమె సదస్సు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర నలుమూలల నుండి వందలాది మహిళా ఉద్యమ నాయకులు, ప్రతినిధులు హాజరవుతారని, శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చలు జరుగుతాయని తెలిపారు.
సదస్సు ముఖ్యాంశాలు:
అక్టోబర్ 5: ఎస్పీఎం క్రికెట్ గ్రౌండ్ నుండి ఎస్బీఐ బ్యాంక్, రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో అఖిల భారత కార్మిక నాయకులు ప్రసంగించనున్నారు. ఈ సభకు సీ ఐ టీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆర్. త్రివేణి అధ్యక్షత వహించనున్నారు. జాతీయ కార్యదర్శి దీపా కె. రాజన్, జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు, సీ ఐ టీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ కన్వీనర్ ఎస్.వి. రమ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు.
అక్టోబర్ 6: ప్రతినిధుల సమావేశంలో మహిళల సమస్యలపై చర్చించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తారు. రాష్ట్ర నలుమూలల నుండి వందలాది మహిళా ప్రతినిధులు పాల్గొననుండగా, మేడ్చల్ జిల్లా నుండి విశేష సంఖ్యలో హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


Comments