రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి అర్హుడికి ఇల్లు... ఆర్థిక మద్దతు అందించడం ప్రభుత్వ లక్ష్యం..
రైతుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు..
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడి
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 24, తెలంగాణ ముచ్చట్లు;
అశ్వరావుపేట డివిజన్లో కొత్తగా ఏర్పాటు అయిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ కమిటీ రైతు సంక్షేమానికి ముఖ్యమైన ఘట్టంగా రైతు సలహా కమిటీ చైర్మన్ ... 24 మంది సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం, 966 ఇల్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ, అలాగే కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద 19 లబ్ధిదారులకు 19, 02,204 చెక్కుల పంపిణీ కార్యక్రమం అశ్వారావుపేట లోని శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ , ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవెల్లి వీరభద్రరావు , 24 సభ్యులు నియామక పత్రాలు అందుకుని ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ .... రైతుల సంక్షేమం, పేదవర్గాల ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి పేదవాడికి నిజమవ్వాలని, రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి అర్హుడికి ఇల్లు, ఆర్థిక మద్దతు, భరోసా , భద్రత అందించడం ప్రధాన లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 కే గ్యాస్, గత ప్రభత్వం ఇవ్వని రేషన్ కార్డులను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన త్వరత సుమారు 11 లక్షల మందికి నూతన రేషన్ కార్డులు, సుమారు 7 లక్షల మంది పాత రేషన్ కార్డులలో పేర్ల నమోదు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు అయ్యాయని, ప్రతి పేదవాడికి హక్కులు, వసతులు సులభంగా అందించబడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ఎటువంటి ఆర్భాటాలకు పోవటం ఏది చేయగలము ఏది చేయలేము అని అంచనాతో ప్రతి వర్గానికి చెబుతూ పేదవాడి గౌరవానికి భంగం కలగకుండా ఉండేవిధంగా పేదవాడు ఆత్మగౌరవంతో బతికే విధంగా పేదవాడికి పూర్తి మద్దతుగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని మంత్రి స్పష్టం చేశారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి పేదవారికి మంచి చేసే కార్యక్రమాన్ని ఈనాడు ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఇల్లు అనేది పేదవారి ఆత్మగౌరమని వారి భరోసా భద్రత కల్పించే విధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవారికి అందిస్తున్నామని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే ఈ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం నుండి ఫౌండేషన్ గృహప్రవేశాల వరకు విడతల వారీగా లబ్ధిదారునికి ఖాతాలో నేరుగా ప్రతి సోమవారం నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పేదవారు ఎక్కడా తలదించుకో కూడదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల పేదవారి అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.
అనంతరం మంత్రి చేతుల మీదగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, హౌసింగ్ పిడి రవీంద్రనాథ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, రైతులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


Comments