డ్రైనేజీ నిర్మించి సమస్యకు పరిష్కారం చూపాలని హైకోర్టు ఆదేశాలు
కాప్రా, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని కాప్రా డివిజన్ ఎల్లారెడ్డిగూడ లో ఉన్న జనప్రియ సిల్వర్ క్రెస్ట్ వాసుల దీర్ఘకాలిక డ్రైనేజీ సమస్యకు హైకోర్టు పరిష్కారం చూపింది.గత మూడు సంవత్సరాలుగా సరిహద్దు లోని శివసాయి ఎన్క్లేవ్ నుండి జనప్రియ సిల్వర్ క్రెస్ట్ కాలనీ మీదుగా పారుతున్న డ్రైనేజీ నీటితో వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో పాటు వ్యాధులు వ్యాపిస్తున్నాయని కాలనీ వాసులు పలుమార్లు అధికారులను, ప్రజాప్రతి నిధులను కోరినా స్పందన రాలేదు.ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ సమస్యను సామాజిక బాధ్యతతో తీసుకుని, అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టులో కేసు దాఖలు చేశారు. విచారణ అనంతరం హైకోర్టు సంబంధిత అధికారులను రెండు వారాల్లోపు కొత్త డ్రైనేజీ నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించింది.హైకోర్టు తీర్పుతో దాదాపు 800 మంది వాసులకు ఊరట లభించింది. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యపై పోరాడుతున్న సొసైటీ సభ్యులు రజిత, విపణి, కిరణ్, వేణుగోపాల్ తదితరులు హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.


Comments