కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
తక్షణమే ప్రతి మహిళకు రూ 2500 ఇవ్వాలి.
- 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైంది..
- కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పెళ్లికి తులం బంగారం ఏమైంది.
- రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే రణమే..
- కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను ఆపేసి మెదక్ కు కన్నీళ్లు తెప్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.
మెదక్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
- తెలంగాణకు తలమానికం మెదక్ చర్చి.
- క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత.
మెదక్ జిల్లాతెలంగాణ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. మహిళల పట్ల ప్రభుత్వానికి నిర్లక్ష్యం, వివక్ష ఎందుకని నిలదీశారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే సోయి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తక్షణమే మహిళలకు నెలకు రూ 2500 ఇవ్వడం, 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలను పంపిణీ చేసే కార్యక్రమాలను మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా బుధవారం నాడు ఎమ్మెల్సీ కవిత మెదక్ చర్చిని సందర్శించారు. అక్కడ ప్రార్థనలు చేశారు. అనంతరం మెదక్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని విమర్శించారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు నెలకు 2500 ఇస్తామని ప్రకటిస్తారని మహిళలు ఆశించారు. కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేస్తారని ప్రజలు ఆశించారు. కానీ రేవంత్ రెడ్డి అలాంటి ఆలోచన చేయడం లేదు.అని వ్యాఖ్యానించారు. మహాలక్ష్మీ పథకం కింద నెలకు రూ. 2500 చెల్లించకపోవడంతో ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇప్పటికీ రూ. 30 వేలు బాకీ పడిందని వివరించారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం దారుణమని అన్నారు. ఈ పథకాన్ని నిలిపివేయడం వల్ల ప్రసవాలకు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని, తద్వారా ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 40 శాతం నేరాలు పెరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాల రేటు పెరగడం ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొట్టిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తక్షణమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద అర్హులను తగ్గించే ప్రయత్నం చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర ప్రభుత్వపు నిబంధలను అమలు చేస్తే 30 శాతం రైతులకు కూడా రైతు భరోసా రాదు. నిబంధనల పేరిట కారు ఉందనో, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారనో, మరైనా సాకు చెప్పి సాగు చేసే రైతులకు రైతు భరోసా ఎగ్గొడితే చూస్తూ ఊరుకోబోమురాష్ట్రంలో ఇప్పటి వరకు 30 శాతం వరి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం సేకరించలేదని ఎండగట్టారు. ధన్యానికి బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం... ఇప్పుడు కేవలం సన్న వడ్లకే పరిమితం చేసిందని, అది కూడా సరిగ్గా ఇవ్వడం లేదని విమర్శించారు. మాట మార్చడం తప్పా ప్రభుత్వంలో ఏం కనిపించడం లేదని, మొక్కజొన్నలు, కందులు, సోయాబీన్, పత్తి వంటి పంటలను మద్ధతు ధరను పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. చెక్కర ఫ్యాక్టర్ లను ఎప్పుడు తెరిపిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బోధన్, మెదక్ తో పాటు ఇతర మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కాబట్టి ఆ దిశగా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా రేషన్ కార్డులు ఇవ్వలేదని, వాటిని త్వరగా జారీ చేసి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మెదక్ కు నీళ్లు వచ్చే కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను ప్రభుత్వం నిలిపివేడయం దారుణమని అన్నారు. కేసీఆర్ పై కోపాన్ని మెదక్ ప్రజలపై తీర్చుకుంటే ఏమొస్తుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు, తెలంగాణకు తలమానికం మెదక్ చర్చి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ కు క్రైస్తవులకు పేగుబంధం ఉందని, తెలంగాణ కోసం ప్రార్థన చేయని చర్చి లేదని గుర్తు చేశారు. మత సహనానికి నిదర్శనం మెదక్ అని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. కేసీఆర్ గోదావరి జలాలతో సింగూరును నింపారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి శుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మెన్ లు మఠం భిక్షపతి, మేడే రాజీవ్ సాగర్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఏం లావణ్య రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ లు కృష్ణ రెడ్డి, మామిళ్ళ ఆంజనేయులు వంజరి. జయరాజ్ ఆర్కే.శ్రీనివాస్ భీమరి కిషోర్, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు అంజ గౌడ్, పట్టణ పార్టీ కో కన్వీనర్లు లింగ రెడ్డి, కృష్ణ గౌడ్, జుబేర్ అహ్మద్, బిఆర్ఎస్ శ్రేణులు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments